: ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ తోనే!... నామినేషన్ కు ముందు సాయిరెడ్డి ఉద్వేగం!
వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీ పడుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నేటి ఉదయం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీలో సాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు వెంటరాగా అసెంబ్లీకి బయలుదేరిన సాయిరెడ్డి కాసేపట్లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, అసెంబ్లీకి బయలుదేరే ముందు పార్టీ కార్యాలయం వద్ద ఆయన కాస్తంత ఉద్వేగానికి లోనయ్యారు. ప్రాణం ఉన్నంత వరకు తాను వైఎస్ కుటుంబంతోనే ఉంటానని ప్రకటించారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. రాజ్యసభలో పార్టీ వాణిని వినిపిస్తానని ప్రకటించారు. పార్టీ పురోభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.