: బీసీసీఐలో రాజకీయాలకు ఈ ఎంపికే నిదర్శనం!

బీసీసీఐలో రాజకీయాలతో నిర్ణయాలను ప్రభావితం చేయగలిగిన వాళ్లకే స్థానం దక్కుతుందని టీమిండియా సెలక్షన్ కమిటీ మరోసారి నిరూపించింది. ఐపీఎల్ లో 'బాగా రాణించారు' అనే కారణం చెప్పి యజువేంద్ర చాహల్, కరణ్ నాయర్, శార్ధుల్ ఠాకుర్, జయంత్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఫయాజ్ ఫజల్ లను జింబాబ్వే, వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు గత రెండు ఐపీఎల్ సీజన్లలో విఫలమవ్వని గౌతమ్ గంభీర్ ను ఎందుకు ఎంపిక చేయలేదన్న ప్రశ్న ప్రతి క్రికెట్ అభిమానిని వేధిస్తోంది. గత ఐపీఎల్ లో అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకున్న గౌతమ్ గంభీర్ తాజా ఐపీఎల్ లో 14 మ్యాచులాడి 473 పరుగులు చేశాడు. అతని ప్రదర్శనను కొలిచేందుకు ఇంతకంటే వేరే కొలమానం కావాలా? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, గతంలో టీమిండియా తరపున ఆడి, అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల్లో ఒకడిగా గంభీర్ నిలిచాడు. యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రాలు జట్టులో స్థానం కోల్పోయి, తిరిగి ఐపీఎల్ ప్రదర్శన కారణంగా జట్టులో స్థానం సంపాదించుకున్నారు. అయితే గంభీర్ మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయాడు. దీనికి కారణం జట్టు కెప్టెన్ ధోనీ, భవిష్యత్ కెప్టెన్ కోహ్లీకి గంభీర్ తో పొసగకపోవడమే. ఇలాంటి వ్యక్తిగత కారణాలతోనే గంభీర్ రీఎంట్రీ కావడం లేదనేది క్రికెట్ వర్గాల ఆరోపణ. దీంతో గంభీర్ కెరీర్ ముగిసినట్టే కనబడుతోంది. ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో మాత్రమే గంభీర్ కనిపించే అవకాశం ఉంది.

More Telugu News