: ఇన్వెస్టర్లను మెప్పించని ఎన్నికల ఫలితాలు... భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అసోంలో తొలిసారిగా పాగా వేసినా, కేరళలో తొలిసారిగా పాదం మోపినా, మార్కెట్ వర్గాలను మాత్రం మెప్పించలేకపోయింది. కీలక బిల్లులకు ఆమోదం, సంస్కరణల అమలుకు బీజేపీకి ఇంకా అడ్డంకులు తొలగలేదని భావించిన మార్కెట్ వర్గాలు అమ్మకాల వైపే మొగ్గు చూపాయి. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 100 పాయింట్ల నష్టంలోకి జారిపోయిన సెన్సెక్స్ సూచిక ఆపై మరే దశలోనూ కోలుకోలేదు. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1.06 లక్షల కోట్లు దిగజారింది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 304.89 పాయింట్లు పడిపోయి 1.19 శాతం నష్టంతో 25,399.72 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 86.75 పాయింట్లు పడిపోయి 1.10 శాతం నష్టంతో 7,783.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.12 శాతం, స్మాల్ కాప్ 1.01 శాతం నష్టపోయాయి. ఇక, ఎన్ఎస్ఈ-50లో 9 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. ఇన్ ఫ్రాటెల్, బీపీసీఎల్, విప్రో, పవర్ గ్రిడ్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, లార్సెన్ అండ్ టూబ్రో, ఐచర్ మోటార్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,712 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 918 కంపెనీలు లాభాలను, 1,628 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు రూ. 97,45,007 కోట్లుగా ఉన్న బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 96,39,686 కోట్లకు తగ్గింది.

More Telugu News