: బెంగళూరుకు వెళ్లిపోయిన యాపిల్ యాప్ డెవలప్ మెంట్ సెంటర్

టెక్నాలజీ జెయింట్ యాపిల్ సంస్థ ఇండియాలో స్థాపించాలని భావించిన యాప్ డిజైన్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ను కర్ణాటక కొట్టేసింది. ఈ సెంటరును దక్కించుకునేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. వినూత్న మొబైల్ యాప్ లను తయారు చేసే ఇండియాలోని డెవలపర్లకు సహకరించేలా బెంగళూరులో సెంటర్ ప్రారంభించనున్నట్టు యాపిల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సెంటర్ కోసం ఎంత పెట్టుబడి పెట్టనున్నామన్న విషయాన్ని యాపిల్ వెల్లడించలేదు. 2017లో ఈ సెంటర్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. "ఇండియాలో స్టార్టప్ సంస్థల పుట్టినిల్లుగా ఉన్న బెంగళూరులో యాప్ డిజైన్ అండ్ డెవలప్ మెంట్ సెంటరును ప్రారంభించనున్నాం. ఇండియాలో ఇప్పటికే వేలమంది కొత్త తరం యాప్ ల తయారీకి కృషి చేస్తున్నారు. ఐఓఎస్ ఆపరేటింగ్ విధానంలో పనిచేసేలా తయారయ్యే యాప్ లకు ఇక్కడ పూర్తి సహాయ, సహకారాలు లభిస్తాయి" అని యాపిల్ వెల్లడించింది. ఇక్కడికి వచ్చి యాప్ లను తయారు చేసే వారికి ప్రతి వారమూ యాపిల్ నిపుణులు సలహా సూచనలు ఇస్తారని యాపిల్ వెల్లడించింది.

More Telugu News