: ధోనీ సేనకు టార్గెట్ 122 పరుగులు!

ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా విశాఖపట్టణం వేదికగా రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో ఆడిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 121 పరుగులు చేసింది. టాస్‌ ఓడిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఎండలు కాస్త ఉపశమనం ఇవ్వడంతో విశాఖలో ఆహ్లాదకర వాతావరణంలో మ్యాచ్ ప్రారంభమైంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో పూణే ఆకట్టుకునేలా బౌలింగ్ చేసింది. ఓపెనర్లు డికాక్ (2), శ్రేయస్ అయ్యర్ (8) దారుణంగా విఫలమయ్యారు. కరుణ్ నాయర్ (41), సంజు శాంసన్ (10) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. సంజు త్వరగానే పెవిలియన్ చేరడంతో కరుణ్ నాయర్ జాగ్రత్తగా ఆడాడు. రిషబ్ పంత్ (4) విఫలం కాగా, డుమిని (10) ఆకట్టుకోలేకపోయాడు. మోరిస్ (38) మెరుపులు మెరిపించినా అప్పటికే చాలా ఆలస్యమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 121 పరుగులు చేసింది. పూణే బౌలర్లలో అశోక్ ధిండా, జంపా చెరి మూడు వికెట్లతో రాణించారు. రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు 120 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేసినా లక్ష్యఛేదన ఏమంత కష్టం కాదనే చెప్పచ్చు!

More Telugu News