: నర్సింగ్ యాదవ్ తో ఫైట్ కి నేను రెడీ: రెజ్లర్ సుశీల్ కుమార్

భారత్ రెజ్లింగ్ సమాఖ్య, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య రియో ఒలింపిక్స్ కు సుశీల్ కుమార్ ను ఎంపిక చేయలేదు. ఆయన స్థానంలో నర్సింగ్ యాదవ్ ను ఎంపిక చేశారు. దీంతో వివాదం మొదలైంది. తనకు అన్యాయం చేశారంటూ అధికారులపై సుశీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెజ్లింగ్ సమాఖ్య ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన మండిపడ్డాడు. దేశానికి రెండు ఒలింపిక్ పతకాలు తెచ్చానని, మరో పతకం తెస్తానని సుశీల్ చెప్పాడు. ఇందుకోసం ఎంతో త్యాగం చేశానని తెలిపాడు. సుశీల్ కుమార్ కు మరో రెజ్లర్ యోగేశ్వర్ దత్ మద్దతు పలికాడు. సచిన్ తదితరులు కూడా సుశీల్ వినతిని సానుకూలంగా పరిశీలించాలని రెజ్లింగ్ సమాఖ్యకు సూచించారు. అయితే తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో ఉత్తమమైన ఆటగాళ్లను రియో ఒలింపిక్స్ కు ఎంపిక చేశామని చెప్పారు. ఎవరో చెప్పారని ఓ ప్రతిభావంతుడికి అన్యాయం చేయలేమని స్పష్టం చేసింది. దీనిపై నిరసన వ్యక్తం చేసిన సుశీల్ కుమార్, ఈ విషయంలో క్రీడల మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరం అయితే నర్సింగ్ యాదవ్ తో ట్రయల్ ఫైట్ కు తాను సిద్ధమని ఆయన సవాలు విసిరారు. కాగా, సుశీల్ కుమార్ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నాడని తెలుస్తోంది.

More Telugu News