: రాణించిన దేశీయ ఆటగాళ్లు... ముంబై లక్ష్యం 152

విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ టీ20 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దేశీయ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన బెంగళూరు టాపార్డర్ ను సునాయాసంగా పెవిలియన్ కు పంపి ముంబై ఇండియన్స్ బౌలర్లు షాకిచ్చారు. టాస్ ఓడి ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ (7) ని మెక్ క్లెంగన్ అవుట్ చేస్తే, వెంటనే గేల్ (5) ను పెవిలియన్ కు పంపి సౌతీ షాకిచ్చాడు. ఆ తరువాత నిలదొక్కుకుని భారీ షాట్లతో విరుచుకుపడతాడని భావించిన డివిలియర్స్ (24)ను రాయుడు రన్నింగ్ క్యాచ్ తో అవుట్ చేశాడు. ఆ తరువాత వాట్సన్ (15) ను అద్భుతమైన త్రోతో రోహిత్ పెవిలియన్ కు పంపాడు. టాప్ ఆర్డర్ లోని మెరికలంతా పెవిలియన్ లో కూర్చోగా, దేశీ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (68), సచిన్ బేబీ (25) ముంబై ఇండియన్స్ పై ఎదురుదాడికి దిగారు. మెక్ క్లెంగన్, సౌతీ, బుమ్రా, హర్భజన్ ఇలా బౌలర్ ఎవరైనా బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో క్రునాల్ పాండ్య, మెక్ క్లెంగన్, సౌతీ చెరో వికెట్ సాధించారు. కోహ్లీ వికెట్ తీయడం ద్వారా 15 వికెట్లు తీసిన మెక్ క్లెంగన్ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

More Telugu News