: టెల్కోలకు మోదం, వినియోగదారులకు ఖేదం... కాల్ డ్రాప్ కు చెల్లించక్కర్లేదంటూ సుప్రీం సంచలన తీర్పు

మొబైల్ ఫోన్ వినియోగదారుల కాల్ డ్రాప్ అయితే రూ. 1 చెల్లించాలన్న ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) నిర్ణయానికి సుప్రీంకోర్టు అడ్డుపడింది. టెలికం ఆపరేటర్లకు ఊరటను కలిగిస్తూ, కాల్ డ్రాప్స్ కు ఎలాంటి రుసుమూ చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. ట్రాయ్ నోటిఫికేషన్ పారదర్శకంగా లేదని, కాల్ డ్రాప్స్ విషయంలో అమెరికా వంటి దేశాల్లో పాటిస్తున్న విధానాన్నే అనుసరించాలని కేంద్రానికి సూచించింది. చేస్తున్న ఫోన్ మధ్యలో కట్ అయి, వినియోగదారుడికి అసౌకర్యం కలిగిన వేళ, రూ. 1 జరిమానా చెల్లించాల్సిందేనని ట్రాయ్ గత సంవత్సరం అక్టోబరులో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సెల్యులార్ అపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా, అక్కడ వారికి చుక్కెదురైంది. ఆపై సుప్రీంను ఆశ్రయించగా, వాదనలు విన్న ధర్మాసనం నేడు తీర్పిచ్చింది. కాల్ డ్రాప్ కేవలం తమ తప్పిదం వల్ల మాత్రమే జరగదని, వాతావరణం నుంచి ఎన్నో అంశాలు ఇందులో ముడిపడివున్నాయని కాయ్ చేసిన వాదనను కోర్టు సమర్థించింది.

More Telugu News