: అనుభవశాలి యువీ తప్పిదం... అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది!

యువరాజ్ సింగ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ కు రెండో వరల్డ్ కప్ వచ్చిందన్నా, టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుందన్నా అందులో ప్రధాన భూమిక యువరాజ్ సింగ్ దే! రెండు టోర్నీల్లోనూ చెలరేగి ఆడిన యువీ టైటిల్స్ ను అందించాడు. అయితే, ఆమధ్య కేన్సర్ బారిన పడి కోలుకున్నాక, యువీ ఆటలో వేగం తగ్గింది. కానీ, ఫ్రాంఛైజీల్లో ఆయనపై నమ్మకం మాత్రం పోలేదు. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుతో యువీ జత కలిశాడు. ముంబైతో విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన యువీ ఆకట్టుకున్నాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో కేవలం 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అయితే, మెక్ క్లెంగన్ వేసిన చివరి ఓవర్ లో భారీ షాట్ కు సిద్ధమైన యువీ బ్యాక్ పుట్ ఆడదామని అనుకుని పొరబాటున వికెట్లను కొట్టేసి, ఔటయ్యాడు. వెంటనే షాక్ కు గురయ్యాడు. అతనలా అవుట్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా బౌలర్లు చివర్లో బ్యాటింగుకి వచ్చినప్పుడు అలాంటి తప్పిదం చేస్తారు. యువీ వికెట్లను గిరాటేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తే, క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ లో హిట్ వికెట్ అయిన ఏకైక ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు.

More Telugu News