: క్రికెట్ దేవుడికి యువీ పాదాభివందనం!

సాగర నగరం విశాఖలో నిన్న రాత్రి అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్ లో భాగంగా నిన్న విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాదు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాడు యువరాజ్ సింగ్... క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు పాదాభివందనం చేశాడు. యువీకి సచిన్ అంటే ఎనలేని గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ కు ముందు వరకు ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడిగా కొనసాగిన సచిన్... ఆ తర్వాత ఆ జట్టుకు చీఫ్ మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న సచిన్ తన జట్టు వెంట విశాఖకు వెళ్లాడు. మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాదు చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో బౌండరీ లైను వద్ద ఉన్న సచిన్ వద్దకు వెళ్లిన యువీ... అతడి పాదాలకు మొక్కాడు. తన పాదాల వద్ద మోకరిల్లిన యువీని పైకి లేపిన సచిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. సచిన్ పాదాలకు యువీ పాదాభివందనం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. 2014లోనూ లండన్ లోని విఖ్యాత క్రికెట్ స్టేడియం లార్డ్స్ లోనూ అతడు సచిన్ కు పాదాభివందనం చేశాడు.

More Telugu News