: ఆ జాత్యహంకారిపై చర్యలు తీసుకోవాలంటూ 50 వేల మంది ఆక్స్ ఫర్డ్ కు పిటిషన్లు పంపారు

ఓ విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వ్యక్తిగత ప్రవర్తనను ఆధారం చేసుకుని, బయట జరిగిన విషయాలపై యూనివర్సిటీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే...ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో లా పూర్తి చేసిన ఆఫ్రికన్ విద్యార్థి క్వాంబే, పబ్లిక్ పాలసీ కోర్సులో పీజీ చేసేందుకు అదే యూనివర్సిటీలో చేరాడు. ఇతనికి శ్వేతజాతీయలంటే ద్వేషం. అవకాశం దొరికిన ప్రతిసారీ వారిని అవమానించాలని ప్రయత్నిస్తుంటాడు. కాగా, అతను ఇటీవల కేప్ టౌన్ వెళ్లాడు. అక్కడ ఓ రెస్టారెంటుకి వెళ్లి కాఫీ తాగాడు. అతనికి కాఫీ అందించిన అక్కడి శ్వేత జాతీయురాలైన ఆష్లే సుల్జ్ (24) అనే వెయిట్రాస్ టిప్ అడిగింది. దానికి అతను ఆమె చేతిలోని టిష్యూపై 'మా నేలను విడిచి వెళ్లిపోతానని చెప్పు టిప్పు ఇస్తా' అని రాసి అందించాడు. అది చదవిన ఆమె కన్నీటి పర్యంతమైంది. దానిని చూసి మొసలి కన్నీరు కారుస్తావెందుకు అంటూ నోరుపారేసుకున్నాడు. ఈ తతంగం అంతా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే, నెటిజన్లు అంతెత్తున ఎగిరిపడ్డారు. ఆమె పట్టుదలతో పని చేసుకుని మరోపక్క చదువుకుంటుంటే ప్రోత్సహించడం మాని ఏడిపిస్తావా? అసలు బుద్ధి ఉందా? అంటూ విమర్శించారు. 'క్వాంబే టిప్ ఇవ్వకపోతే ఏం' అంటూ 2.07 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంతటితో ఆగని సానుభూతి పరులు జాత్యహంకారం నరనరాన నింపుకున్న క్వాంబేపై చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధికారులు తలలు పట్టుకున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 50 వేల మంది పిటిషన్లు పంపడం విశేషం. -

More Telugu News