: వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ లను ఆకాశానికెత్తేసిన దాసరి!... ఆసక్తికరంగా దర్శకరత్న కామెంట్స్!

ఏపీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ లపై దర్శకరత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు నిన్న ఆసక్తికర కామెంట్లు చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. సాధించాలనే తపన ఉన్న నేతగా వైఎస్ జగన్ ను దాసరి అభివర్ణించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ను కమిట్ మెంట్ ఉన్న నేతగా ఆయన ఆకాశానికెత్తేశారు. అసలు దాసరి ఆ ఇద్దరి గురించి ఏమన్నారంటే....‘‘వైఎస్ తో నాకున్న అనుబంధం అందరికీ తెలిసిందే. 1978లో వారు రాజ్, యువరాజ్ సినిమా థియేటర్లను కడితే... యువరాజ్ ను నేను ప్రారంభించాను. అప్పటి నుంచి మా మధ్య మంచి సంబంధాలున్నాయి. ఆ అనుబంధంతోనే ఇటీవల జగన్ నన్ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. రాజకీయాల్లోకి రమ్మని అతను నన్ను ఆహ్వానించలేదు. సాధించాలని తపన ఉన్న మనిషి జగన్. పవన్ కు కమిట్ మెంట్ ఉంటుంది. మాట మీద నిలబడతాడు. రాజకీయాల్లోకి వెళ్లడానికి సన్నద్ధమవుతున్నాడు. బాధ్యతలు తీసుకొనేటప్పుడు రెండు పడవల మీద ప్రయాణం సరికాదనేది నా అభిప్రాయం’’ అని దాసరి వ్యాఖ్యానించారు.

More Telugu News