: 'ఉజ్జీవన్'కు ఇన్వెస్టర్ల నుంచి అత్యద్భుత స్పందన!

నిధుల సమీకరణ నిమిత్తం ఐపీఓకు వచ్చిన ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటాలను సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. మొత్తం 2,96,63,706 ఈక్విటీ వాటాలను సంస్థ విక్రయానికి ఉంచగా, మరో గంటలో ఐపీఓ ముగుస్తుందనగా 26.8 రెట్లు అధికంగా 79,33,06,500 వాటాలను కొనుగోలు చేసేందుకు బిడ్లు దాఖలయ్యాయి. ఇటీవలి కాలంలో ఇంత అత్యధిక స్పందన ఓ ఐపీఓకు రావడం ఇదే తొలిసారి. రిటైల్ ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన వాటాల్లో 1.35 రెట్లు అధిక బిడ్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు (ఎన్ఐఐ - నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) ఉద్దేశించిన వాటాలకు 46.71 రెట్ల అధిక బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ (క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్) విభాగంలో 9.69 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం రూ. 880 కోట్ల మేరకు నిధుల సమీకరణ నిమిత్తం ఐపీఓకు వచ్చిన ఉజ్జీవన్, విజయం సాధించడంతో మరిన్ని ఐపీఓలు మార్కెట్ ను తాకుతాయని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, రూ. 210 అప్పర్ బ్యాండ్ లోనే వాటాలన్నీ అమ్ముడయ్యాయని బీఎస్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

More Telugu News