: బిలియనీర్ల జీవనశైలి ఇలా సాగుతుంది...!

ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసి, విజయపథంలో నడుస్తున్న వ్యాపార దిగ్గజాలు తమ అలవాట్లు, ఆరోగ్యం, ఆలోచనలు... మొదలైన అంశాలపై చాలా శ్రద్ధ కనబరుస్తారు. బిలియనీర్ల జీవితాల గురించి సుమారు ఐదేళ్ల పాటు అధ్యయనం చేసిన రచయిత థామస్ సి కోర్లే పలు విషయాలను వెల్లడించారు. తమ పని దినాలు ప్రారంభించడానికి కనీసం మూడు గంటల ముందు నిద్రలేచే బిలియనీర్లు 50 శాతం మంది వరకు ఉంటారని ఆయన అధ్యయనంలో తేలింది. మానసిక, శారీరక ఆరోగ్య గురించి వారు తీసుకునే జాగ్రత్తల విషయాని కొస్తే... * తొందరగా నిద్రలేవడం...: వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్ సన్ తో పాటు చాలామంది బిలియనీర్లు ఉదయం 5.45 గంటలకు లేచేవారే. వ్యాయామం అనంతరం వారి పనులు మొదలు పెడతారు. * మెడిటేషన్...: బ్రిడ్జి వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో, ట్విట్టర్, స్క్వేర్ సీఈవో జాక్ డార్సే, మీడియా మొఘల్ ఓప్రా విన్ఫ్రే లు నిత్యం మెడిటేషన్ చేస్తుంటారు. ‘నా జీవితంలో అన్నింటికన్నా విలువైనది మెడిటేషన్. నిత్యజీవితంలో అత్యవసరమైన నిత్యావసరం మెడిటేషన్’ అని డాలియో అభివర్ణించారు. * దానధర్మాలు..: బ్లూమ్ బర్గ్ మీడియా సీఈఓ మైఖేల్ బ్లూమ్ బర్గ్, బిలియనీర్లు వారెన్ బఫెట్, బిల్ గేట్స్, మెలిందా గేట్స్ లు తమ సంపాదనలో ఇప్పటికే చాలా భాగం దానధర్మాలకు కేటాయించారు. మరికొంత మంది బిలియనీర్లు తమ సంపాదనలో కొంత భాగాన్ని చారిటీ సంస్థలకు ఇస్తామని వాగ్దానాలు చేశారు. * ఖర్చులో పొదుపు ...: చాలా జాగ్రత్తగా, పొదుపుగా డబ్బు వినియోగం ఉంటుంది. ఉదాహరణకు వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ మరణించే వరకు కూడా 1979 ఫోర్డ్ ఎఫ్ 150నే వినియోగించారు. ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ఉపయోగించే వాహనం ఎంట్రీ లెవెల్ సెడాన్ కాగా, బిల్ గేట్స్ కమర్షియల్ క్లాసులోనే విమానం ప్రయాణం చేేస్తుంటారు. * పుస్తక ప్రియులు...: ప్రపంచ విజేతలుగా నిలిచిన వారిలో చాలా మంది పుస్తక ప్రియులే. మార్క్ జుకర్ బర్గ్, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ లు ఈ కోవకు చెందిన వారే. ఈ సందర్భంగా, కనీసం రెండు వారాలకు ఒక పుస్తకమైనా చదవాలని జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. పుస్తకాలు చదవడం ద్వారానే రాకెట్ల నిర్మాణం నేర్చుకున్నానన్న ఎలాన్ మస్క్ మాటలు గుర్తుంచుకోవాల్సినవే. అంతేకాకుండా వ్యాయామం, ఆయా రంగాల్లో విజయవంతమైన వ్యక్తులను తరచుగా కలుసుకోవడంతో పాటు పలు అంశాలు చాలా మంది బిలియనీర్ల జీవితాల్లో కామన్ గా కనిపించేవని రచయిత థామస్ సి కోర్లే వివరించారు.

More Telugu News