: ధోనీ... జనం మనిషి!: ‘ఆమ్రపాలి’తో ఒప్పందం రద్దు చేసుకున్న కెప్టెన్ కూల్

టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీది ఎప్పుడూ ప్రజాపక్షమే. ఈ విషయంలో తనకు కొంత మేర నష్టం వాటిల్లినా అతడు అంతగా పట్టించుకోడు. ఈ మేరకు నిన్న అతడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ కంపెనీతో అతడు తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఆమ్రపాలికి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నోయిడాలో ‘సఫైర్’ పేరిట ఈ సంస్థ నిర్మించిన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ సరైన వసతులు కల్పించలేదని ఆరోపించారు. ఈ క్రమంలో తమను పట్టించుకోని ఆమ్రపాలి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగవద్దంటూ ధోనీని వారు కోరారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో చేపట్టిన ప్రచారం వైరల్ గా మారింది. ఈ క్రమంలో సదరు కంపెనీతో చర్చలు జరిపిన ధోనీ... జనం వాదనకే విలువ ఇచ్చి సదరు కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఈ మేరకు ఆమ్రపాలి నిన్న ఓ ప్రకటన చేసింది. ఇకపై ధోనీ తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగరని తెలిపింది.

More Telugu News