: ఆ పేర్లు మీవేనా?... సూటిగా చెప్పాలని ‘పనామా' ఇండియన్స్ కు ఐటీ శాఖ తాఖీదులు

స్వదేశంలో గుట్టుగా దాచుకున్న అక్రమార్జనను బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ లో పెట్టుబడులుగా మార్చేసిన వివిధ దేశాలకు చెందిన నల్ల కుబేరుల జాబితాను మోసుకొచ్చిన ‘పనామా పేపర్స్’ ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ కలకలం రేపాయి. ఈ జాబితాలో దాదాపు 500 మంది భారతీయులున్నట్లు ఆ పేపర్లు వెల్లడించాయి. ఈ జాబితాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు పలువురు ప్రముఖులు ఉండటంతో పెద్ద దుమారమే రేగింది. ఈ క్రమంలో ఆదాయపన్ను(ఐటీ) శాఖ ఈ వ్యవహారంపై కన్నేసింది. ఇప్పటికే దీనిపై విచారణ చేపట్టిన ఐటీ శాఖ తాజాగా జాబితాలో పేర్లున్న 500 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో రెండే రెండు ప్రశ్నలను ఆ శాఖాధికారులు నల్ల కుబేరులకు సంధించారట. ‘‘పనామా పేపర్స్ లో ఉన్న పేర్లు మీవేనా?, మోసాక్ ఫోన్సెకాతో మీ వ్యాపార లావాదేవీలను చెప్పండి’’ అంటూ రెండు ప్రశ్నలను సంధించిన ఐటీ శాఖ.. ఈ రెండు ప్రశ్నలకు మాత్రం సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని కూడా కోరింది. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని కూడా సదరు నోటీసుల్లో ఐటీ శాఖ డేంజర్ బెల్స్ మోగించిందని సమాచారం.

More Telugu News