: ప్రత్యూష బెనర్జీ చిత్రహింసలకు గురైన ఆనవాళ్లున్నాయి!... కోర్టుకు పోలీసుల వెల్లడి

హిందీ టీవీ సీరియల్స్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ చిత్రహింసల నేపథ్యంలోనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ ను నిన్న దిందోషి సెషన్స్ కోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా పోలీసులు రాహుల్ పై కీలక ఆరోపణలు చేశారు. ప్రత్యూష శరీరంపై ఆమెను చిత్రహింసలకు గురి చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, ఈ క్రమంలో సదరు చిత్రహింసలు తట్టుకోలేకే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కోర్టుకు తెలిపారు. అంతేకాక ఈ విచారణకు సాక్షులుగా హాజరైన పలువురు కూడా ఇదే వాదనను వినిపించారు. నిత్యం ప్రత్యూష, రాహుల్ ల మధ్య వాగ్వాదం జరిగేదని కోర్టుకు తెలిపారు. ప్రత్యూషను మానసికంగానే కాక శారీరకంగానే రాహుల్ బాధ పెట్టేవాడని కూడా వారు పేర్కొన్నారు. సాక్షులు, పోలీసులు చేసిన వాదనతో కోర్టు రాహుల్ కు బెయిలిచ్చేందుకు నిరాకరించింది.

More Telugu News