: కోహ్లీ, అనుష్క మళ్లీ కలిసిపోయిన మాట నిజమే!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మలు మళ్లీ కలిసిపోయారు. మొన్న ఫిబ్రవరి వరకు నిత్యం కలిసి కనిపించిన ఈ సెలిబ్రిటీ కపుల్... ఎక్కడ కనిపించినా చేతిలో చేయి వేసుకుని కనిపించింది. ఇక మైదానంలో కోహ్లీ క్రికెట్ ఆడుతుంటే, సినిమా షూటింగ్ లు మానుకుని మరీ స్టాండ్స్ లో కూర్చుని కేరింతలు కొట్టిన అనుష్క శర్మ అతడి ఆటను చూస్తూ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత అతని అభీష్టానికి వ్యతిరేకంగా ఆమె ఓ సినిమా ఒప్పుకోవడంతో ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా, ఫిబ్రవరిలో ఈ జంట విడిపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిపోయారు. క్రికెట్ లో కోహ్లీ లీనమైపోతే, అనుష్క తన సినిమాలతో బిజీగా మారిపోయింది. గడచిన రెండు నెలలుగా ఈ జంట కలిసి కనిపించలేదు. విడిపోయిన విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియాలో బయటపెట్టేశాడు కూడా. అయితే వారిద్దరూ మళ్లీ కలిసిపోయారంటూ నిన్న ‘మిస్ మాలిని.కామ్’ అనే వెబ్ సైట్ ఓ సంచలన వార్తను రాసేసింది. ముంబైలోని బాంద్రాకు చెందిన ఓ రెస్టారెంట్ లో వీరిద్దరూ కలిసి విందు ఆరగించారని ఆ వెబ్ సైట్ తెలిపింది. అయితే వారిద్దరూ కలిసిన ఫొటోలను మాత్రం ఆ వెబ్ సైట్ సాధించలేకపోయింది. తాజాగా ‘మిస్ మాలిని.కామ్’ చెప్పిన విషయం వాస్తవమేనంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానెల్ ‘ఎన్డీటీవీ’ పేర్కొంది. అనుష్కతో కలిసి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న కోహ్లీ ఫొటోను ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ నెల 6న ఈ దృశ్యం కనిపించిందని ఆ ఛానెల్ ఆన్ లైన్ ఎడిషన్ ఓ ప్రత్యేక వార్తను ప్రచురించింది.

More Telugu News