: 'వర్షం' హిందీ రీమేక్ 'బాఘీ' నిర్మాతలకు నోటీసులు

తెలుగులో మంచి విజయం సాధించిన 'వర్షం' సినిమాను హిందీలో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో 'బాఘీ' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడిది నిర్మాతకు చిక్కులు తెచ్చింది. ఈ ట్రైలర్ ఇండోనేసియన్ యాక్షన్ సినిమా 'ద రెయిడ్: రిడంప్షన్'కి కాపీలా ఉందంటూ ఆ చిత్ర నిర్మాత మోంగా 'బాఘీ' నిర్మాతలు సాజిద్ నడియావాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లకు నోటీసులు పంపారు. 'రిడంప్షన్'ను రీమేక్ చేసేందుకు సిఖ్యా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకే హక్కులు ఉన్నాయని మోంగా తెలిపారు. కాగా, దీనిపై 'బాఘీ' నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించిన 'వర్షం' రీమేక్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను టైగర్ ష్రాఫ్ పోషించగా, త్రిష పాత్రను శ్రద్ధా కపూర్, గోపీచంద్ వేసిన పాత్రను నటుడు సుధీర్ బాబు వేస్తుండగా, మరో కీలక పాత్రలో కోట శ్రీనివాసరావు నటిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా రూపొందుతోంది.

More Telugu News