: ఔత్సాహిక క్రికెటర్లూ! కష్టపడండి...కలలు సాకారం చేసుకోండి : సచిన్ టెండూల్కర్

యువత క్రికెట్ రంగంలో వృద్ధి చెందాలని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. మహారాష్ట్రలోని బారామతిలో బాబా సాహెబ్ అంబేద్కర్ స్టేడియాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, ముంబయి క్రికెట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, దేశం తరపున ఆడాలనుకునే యువత తమ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలని సూచించారు. క్రికెట్ కెరీర్ లో విజయం సాధించాలనుకుంటే కష్టపడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎంతగా కష్టపడాలంటే... క్రికెట్ ఫీల్డ్ ను సంసిద్ధం చేసేందుకు ఎంత నీటిని అయితే గ్రౌండ్ మ్యాన్ ఉపయోగిస్తాడో, అంతగా ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులు చెమట చిందించాలన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేస్తున్న కృషిని సచిన్ కొనియాడారు. కాగా, శరద్ పవార్ స్వస్థలమైన బారామతిలో ఈ స్టేడియంను ఏర్పాటు చేశారు.

More Telugu News