: పచ్చి నిజం... రూ. 10,500కి ఫోన్ తయారు చేసి రూ. 40 వేలకు అమ్ముతున్న యాపిల్!

యాపిల్ ఐఫోన్... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ వేరియంట్. ఈ సిరీస్ లో ఇప్పటికే పలు రకాల మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటిల్లో తాజాగా వచ్చిందే ఐఫోన్ ఎస్ఈ. యాపిల్ విక్రయిస్తున్న స్మార్ట్ ఫోన్లలో ఇదే అతి తక్కువ ధరకు లభించే మోడల్. అది కూడా అంతర్జాతీయ మార్కెట్లో 399 డాలర్లుగా ఉన్న ధరను భారత్ లో రూ. 39 వేలకు విక్రయిస్తోంది. వాస్తవానికి ఈ ఫోన్ తయారీకి 160 డాలర్లు (సుమారు రూ. 10,500) మాత్రమే ఖర్చవుతుందట. రీసెర్చ్ సంస్థ ఐహచ్ఎస్ విశ్లేషణ ప్రకారం, యాపిల్ సంస్థ రూ. 10500 ఫోన్ తయారు చేసి దాన్ని రూ. 40 వేలకు ప్రజలకు అంటగడుతోంది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంటిగ్రేటెడ్ ఇన్-సెల్ టచ్ సెన్సింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే ధర కేవలం 20 డాలర్లు (సుమారు రూ. 1,300) మాత్రమే. ఇక ఐఫోన్లలో వాడుతున్న సెల్యులార్ చిప్ ఖరీదు 15 నుంచి 22 డాలర్ల వరకూ ఉంటుందట. ఐఫోన్ ఎస్ఈలో 64 గిగాబైట్ల మెమొరీ సామర్థ్యమున్న వేరియంట్ తయారీకి 170 డాలర్లకన్నా ఎక్కవ ఖర్చు కాదని, దీనిని రూ. 49 వేలకు (భారత మార్కెట్ ధర) అమ్ముతున్నారని ఆరోపించింది. కేవలం అధిక స్టోరేజ్ ఉందని చూపుతూ, 10 డాలర్ల తయారీ ఖర్చు పెరిగినందుకు 100 డాలర్ల ధర పెంచుతోందని తెలిపింది. కేవలం మార్జిన్లపై మాత్రమే దృష్టిని సారించిన సంస్థ మిగతా స్మార్ట్ ఫోన్ వేరియంట్ల విషయంలోనూ ఇదే విధమైన విధానాన్ని అవలంబిస్తోందట. తయారీ ఖర్చుకు 300 నుంచి 400 శాతం అదనపు ధరలతో మార్కెట్లోకి ఫోన్లను విడుదల చేస్తోందని, ఆపై కొంత కాలం తరువాత కాస్తంత ధరలు తగ్గిస్తోందని ఐహెచ్ఎస్ వెల్లడించింది.

More Telugu News