: ఆకట్టుకున్న ఇంగ్లండ్ బౌలర్లు... కీవీస్ స్కోరు 153

మొహాలీ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ లో ఇంగ్లండ్ బౌలర్లు ఆకట్టుకున్నారు. జోరు మీదున్న కివీస్ బ్యాట్స్ మెన్ దూకుడుకి కళ్లెం వేశారు. భారీ స్కోరు లక్ష్యంగా కివీస్ ఆటగాళ్లు చెలరేగుతారని అంతా భావించారు. తమకంటే బలంగా ఉన్న ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కు భారీ లక్ష్యం నిర్దేశించాలని భావించారు. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఆకట్టుకునేలా బౌలింగ్ చేయడంతో కివీస్ 153 పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు గుప్తిల్ (15), విలియమ్సన్ (32) శుభారంభం ఇచ్చారు. గుప్తిల్ ను విల్లీ బలిగొనడంతో మున్రో (48) ఆకట్టుకున్నాడు. ఆండర్సన్ (28) కు ఇంగ్లండ్ బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బంతులతో ఇంగ్లిష్ బౌలర్లు ఆకట్టుకున్నారు. అద్భుతమైన యార్కర్లు సంధిస్తూ ఆటగాళ్లు షాట్ కొట్టేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో రాస్ టేలర్ (6), రోంచీ (3), శాంటనర్ (7), మెక్ క్లెంగన్ (1), ఇలియట్ (4) ఎలాంటి భారీ షాట్లు ఆడలేకపోయారంటే ఇంగ్లండ్ బౌలర్లు ఎలాంటి బంతులు వేశారో అర్థం చేసుకోవచ్చు. దీంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ మూడు వికెట్లతో రాణించగా, అతనికి విల్లీ, జోర్డన్, ప్లంకెట్, మొయిన్ అలా చెరో వికెట్ తీసి సహకారమందించారు.

More Telugu News