: 'సత్తెకాలపు సత్తెయ్య' కనుకే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు: రోహిత్ శర్మ

సోషల్ మీడియాలో అకౌంట్ లేదని, పాత కాలపు నోకియా ఫోన్ నే వాడుతున్నానని ప్రకటించిన టీమిండియా స్టార్ బౌలర్ ఆశిష్ నెహ్రాపై సోషల్ మీడియాలో ప్రశంసలు, విమర్శలు పెరిగాయి. ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'సత్తెకాలపు సత్తెయ్య' అంటూ పలువురు నెహ్రాను విమర్శించారు. వీటిపై టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. సోషల్ మీడియాలో నెహ్రా ట్రెండ్ అవుతున్నాడు...ఈ విషయం అతను చూడకపోవడమే ఆశ్చర్యం...ఎందుకంటే నెహ్రా 'సత్తెకాలపు సత్తెయ్య' కనుక అంటూ పేర్కొన్నాడు. కాగా, ఆశిష్ నెహ్రా ఇప్పుడు టీమిండియా బౌలింగ్ భారాన్ని మోస్తున్నాడు. సీనియర్ బౌలర్ అయిన నెహ్రా గాయాలు, ఫాం లేమితో జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ పుణ్యమా అని టీట్వంటీల్లో చోటు దక్కించుకున్నాడు. పొదుపైన బౌలింగ్ తో పరిమిత ఓవర్ల క్రికెట్ లో నెహ్రా ఆకట్టుకుంటున్నాడు. ఆదిలో ఓపెనర్ల వికెట్లు తీస్తూ టీమిండియా బౌలర్లకు మార్గదర్శిగా నిలబడుతున్నాడు. అంతే కాకుండా బుమ్రా, పాండ్య లాంటి బౌలర్లకు ఎలాంటి బంతులు సంధించాలో చెబుతూ వారికి మైదానంలో గురువుగా మారుతున్నాడు.

More Telugu News