: అవ‌కాశం ఇస్తే మ‌ళ్లీ మైదానంలోకి.. రాజ‌కీయ ఇన్సింగ్స్ ప్రారంభించిన నేప‌థ్యంలో శ్రీ‌శాంత్ వ్యాఖ్య‌లు

అవ‌కాశం ఇస్తే మ‌ళ్లీ క్రికెట్‌ మైదానంలో అడుగు పెడ‌తాన‌ని భార‌త మాజీ క్రికెట‌ర్ శ్రీ‌శాంత్ అన్నాడు. కెరీర్ ప్రారంభంలోనే అద్భుత ప్రతిభ కనబరచి 'కేరళ స్పీడ్ స్టర్'గా పేరుతెచ్చుకున్న శ్రీ‌శాంత్‌.. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటకు దూరమైన విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌లే రాజ‌కీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన శ్రీ‌శాంత్.. జీవితంలో ఎన్ని రంగాల్లో రాణించాలనుకున్నా తనకు గుర్తింపునిచ్చింది క్రికెట్టేనని వ్యాఖ్యానించాడు. అవకాశం వస్తే మళ్లీ మైదానంలోకి వెళ్తాన‌న్నాడు. శ్రీశాంత్‌కి భాజపాతో రెండేళ్ల క్రితం నుంచే పరిచయం ఉందని అతని తండ్రి శాంతాకుమారన్‌ నాయర్ చెప్పారు. వచ్చే నెలలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోన్న బీజేపీ.. తొలి విడతగా 51 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సిటీల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండటంతోపాటు యువతరం ఓట్లను కొల్లగొట్టగలడనే నమ్మకంతోనే శ్రీశాంత్ ను తిరువనంతపురం నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దింప‌నున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News