: 70 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్... టోర్నీ నుంచి ఔట్!

టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పేలవమైన ఆటతీరుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కోల్ కతా వేదికగా న్యూజిలాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పేలవంగా ముగిసింది. 146 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ విజయం కోసం ఆడుతున్నట్టు కనపడలేదు. తట్టాబుట్టా సర్దేసుకుని స్వదేశం ఎంత త్వరగా వెళ్లిపోదామా? అన్న తొందరలో ఆడినట్టు కనిపించారు. ఒకరి తరువాత ఒకరుగా పెవలియన్ చేరి ఈ టోర్నీలో అత్యల్ప స్కోరు నమోదు చేశారు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (3) అద్భుతమైన ఫీల్డింగ్ కు రనౌట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మహ్మద్ మిథున్ (11) కు షబ్బీర్ రెహ్మాన్ (12) జత కలిశాడు. వీరిద్దరూ నిలదొక్కుకుంటున్నట్టే కనబడ్డారు. వీరు త్వరగా పెవిలియన్ చేరడంతో షకిబల్ హసన్ (2), సౌమ్య సర్కార్ (6), ముష్ఫికర్ రహీం (0) అవుటయ్యారు. దీంతో మహ్మదుల్లా (5) కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం షవగత హోం (16) కివీస్ ఆటగాళ్లను కాసేపు ప్రతిఘటించాడు. అయినప్పటికీ మొర్తజా (3), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (6), అల్ అమీన్ హోసైన్ (0) అవుటయ్యారు. దీంతో 15.4 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 70 పరుగులకే ఆల్ అవుట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఇలియట్, సోడీ చెరో మూడు వికెట్లు తీయగా, మెక్ కల్లమ్, మెక్ క్లెంగన్, శాంటనర్ చెరో వికెట్ తీసి వారికి చక్కని సహకారమందించారు. 42 పరుగులు చేసిన విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

More Telugu News