: పాకిస్థాన్-భారత్ మ్యాచ్ గురించి గొల్లపూడి మారుతీరావు విశ్లేషణ!

ఏ విషయం గురించైనా ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు తన దైనశైలిలో విశ్లేషణ ఇస్తారు. అలాగే, ఇటీవల భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి, అసలు భారత్ ఎందుకు విజయం సాధిస్తుంది? పాక్ ఎందుకు ఓటమిపాలవుతుంది? అన్న విషయాలను విశ్లేషించారు. ఈ రెండు జట్లు ఏ వేదికమీద తలపడినా రెండు దేశాల క్రీడాభిమానుల్లో ఒకే రకమయిన ఉద్వేగం నెలకొంటుంది. ఈ ఉద్వేగాలను నియంత్రించాల్సిన భాధ్యత ఆటగాళ్లపై ఉంటుంది. మైదానంలో ఆడడం ద్వారా ఆకట్టుకోవాల్సిన ఆటగాళ్లు భావోద్వేగాలను తీవ్రస్థాయిలో ప్రదర్శించడం వల్ల అభిమానుల్లో ఉద్రేకాలు రేగుతాయి. అయితే, ఈ రకమైన ఉద్వేగాన్ని టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన రీతిలో నియంత్రించుకున్నారని గొల్లపూడి అభిప్రాయపడ్డారు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఉమర్ అక్మల్ క్యాచ్ ను పట్టుకున్న ధోనీ మైదానం మధ్యకు వచ్చి సాధారణంగా అభినందించుకున్న తీరుకి, శిఖర్ ధావన్ వికెట్ తీసిన అనంతరం అమీర్ తో పాక్ ఆటగాళ్లు పంచుకున్న ఆనందానికి ఎంతో వ్యత్యాసం ఉందని గొల్లపూడి పేర్కొన్నారు. అలాగే 45 పరుగుల వద్ద ఫోర్ కొట్టిన కోహ్లీని ధోనీ ఆనందంగా అభినందిస్తే...భారత్ వికెట్ పడిన ప్రతిసారీ అఫ్రిదీ రగిలిపోయాడు. ఇలా భారత జట్టు క్రికెట్ ను ఆటగా ఆనందిస్తూ ఆడితే...పాకిస్థాన్ జట్టు ఇదే యుద్ధమన్నట్టు ఆడుతోంది. తద్వారా పాకిస్థాన్ లో గెలిచి తీరాలనే కసి కనబడుతోంది తప్ప, ఆట కనపడడం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో పాకిస్థాన్ జట్టుపై భారత జట్టు సునాయాసంగా విజయం సాధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ కు క్రికెట్ ఒక ఆట. అదే సమయంలో పాకిస్థాన్ కు అది యుద్ధం, సత్తాచాటాలన్న ఆవేశం వెరసి భారత జట్టు చేతిలో పాక్ కు పరాజయం. ఇమ్రాన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, జహీర్ అబ్బాస్ వంటి ఆటగాళ్లు పాక్ ఆట ప్రతిష్ఠను పెంచితే...భారత్ లో స్వదేశంలో కంటే అద్భుతమైన ఆదరణ లభించిందన్న అఫ్రిదీపై ఒక వ్యక్తి కేసు పెట్టగా, జావెద్ మియాందాద్ కూడా విరుచుకుపడ్డాడు. ఇప్పుడు అప్రిదీని తొలగిస్తామంటున్నారు... పాకిస్థాన్ లో భారత్ కు ఇంతకంటే గొప్ప ఆదరణ ఎలా లభిస్తుందని గొల్లపూడి ప్రశ్నించారు.

More Telugu News