: అఫ్రిది, వకార్ లను ఇక సాగనంపుతాం!: పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఓటమి ఆ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది, కోచ్ వకార్ యూనిస్ ల కొంపముంచింది. కోల్ కతా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ ను వీక్షించి, పాకిస్థాన్ చేరుకున్న పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ పాక్ మీడియాతో మాట్లాడుతూ, అఫ్రిది, కోచ్ వకార్ యూనిస్ ను టీ20 టోర్నీ అనంతరం తొలగిస్తున్నట్టు ప్రకటించారు. టోర్నీకి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అఫ్రిది ఈ టోర్నీ వరకే కెప్టెన్ గా కొనసాగుతాడని షహర్యార్ ఖాన్ తెలిపారు. రిటైర్మెంట్ గురించి అఫ్రిది ఇంతకు ముందే తమకు తెలిపాడని, అయితే అతను ఆటగాడిగా కొనసాగాలని భావించినా దానిపై పునరాలోచిస్తామని ఆయన చెప్పారు. అయితే ఆటగాడిగా కొనసాగుతాడా? లేదా? అన్నది అప్పటి పరిస్థితులే నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు. వకార్ యూనిస్ ను కూడా ఇంటికి సాగనంపుతామని ఆయన చెప్పారు. పాకిస్థాన్ జట్టులో షాహిద్ అఫ్రిది ఐకానిక్ ఆటగాడని షహర్యార్ పేర్కొన్నారు, తన ప్రతిభతో పాకిస్థాన్ జట్టును ఎన్నో మ్యాచుల్లో గెలిపించాడని గుర్తు చేశారు. అయితే భారత్ వంటి పెద్దజట్టుతో ఆడిఓడినప్పుడు విమర్శలు సహజమేనని ఆయన చెప్పారు.

More Telugu News