: ఇండియన్స్ రాకూడదంటున్న డొనాల్డ్ ట్రంప్... ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెడతాడట!

అమెరికా నిర్మాణ రంగంలో దిగ్గజ వ్యాపారవేత్తగా ఓ వెలుగు వెలుగుతూ, అధ్యక్ష పదవికి ఫ్రంట్ రన్నర్ గా నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. భారతీయుల రాక కారణంగా, అమెరికన్లు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని పలుమార్లు వ్యాఖ్యానించిన ఆయన, ట్రంప్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఇండియాలోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ కుమారుడు, ట్రంప్ ఆర్గనైజేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ స్వయంగా వెల్లడించారు. పుణె, ముంబైలో తమ ప్రాజెక్టులు విజయవంతమైనాయని గుర్తు చేసిన జూనియర్ డొనాల్డ్, ఇకపై ఉత్తర, తూర్పు ప్రాంతాలపై దృష్టిని సారించనున్నామని తెలిపారు. కాగా, పుణెలో పంచశీల్ రియాల్టీతో కలిసి ట్రంప్ ఆర్గనైజేషన్ చేపట్టిన 46 అపార్ట్ మెంట్ల సూపర్ లగ్జరీ ప్రాజెక్టు, లోధా గ్రూప్ తో కలసి ముంబైలోని లోవర్ పారెల్ ప్రాంతంలో చేపట్టిన 300 అపార్టు మెంట్ల ప్రాజెక్టులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, ఇండియాలో తామో మైలురాయిని దాటినట్టని, ఈ వేడుకల కోసం తాను ఇండియాకు వస్తానని తెలిపారు. ట్రంప్ బ్రాండ్ ను దేశవ్యాప్తం చేస్తామని, ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో సూపర్ లగ్జరీ నిర్మాణాలు చేపడతామని వివరించారు. ఆతిథ్య రంగంతో పాటు గోల్ఫ్ కోర్సులు, కాసినోల ఏర్పాటుకు యత్నిస్తామని వివరించారు.

More Telugu News