: సెలవుల వారం... నాలుగు రోజుల పాటు మార్కెట్లు బంద్

భారత స్టాక్, బులియన్, ఫారెక్స్ మార్కెట్లు దీర్ఘ వారాంతానికి సిద్ధమయ్యాయి. ఈ వారంలో 24 నుంచి 27వ తేదీ వరకూ అన్ని మార్కెట్లూ మూతపడనున్నాయి. 24వ తేదీన హోలీ, ఆపై 25న గుడ్ ఫ్రైడే, 26, 27 తేదీల్లో శని, ఆది వారాల కారణంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, బులియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్ లకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు మూడు రోజులు, మరికొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి. ఇదిలావుండగా, మార్చి 18తో ముగిసిన వారాంతంలో సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 24,953 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ 94 పాయింట్ల వృద్ధితో 7,604 పాయింట్లకు చేరింది. తదుపరి వారంలో ఒడిదుడుకుల మధ్య సూచికలు సాగవచ్చని, ఆపై గురు, శుక్ర వారాల్లో యూఎస్ మార్కెట్ల కదలికలను అనుసరించి, తదుపరి సోమవారం నాడు పొజిషన్స్ తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 6,900 నుంచి 7,600 మధ్య కదలాడవచ్చని బొనాంజా పోర్ట్ ఫోలియోలో ఫైనాన్షియల్ ప్లానింగ్ విభాగం హెడ్ అచిన్ గోయల్ అభిప్రాయపడ్డారు.

More Telugu News