: 118 పరుగులు సాధించిన పాకిస్థాన్... మరి కాసేపట్లో భారత్ బ్యాటింగ్!

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ఆకట్టుకుంది. వర్షంతో తడిసిన పిచ్ పై 18 ఓవర్ల మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా ఆరంభించింది. ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. దీంతో షెహజాద్ (28), షెర్జిల్ (17) భారీ షాట్లకు యత్నించి పెవిలియన్ చేరారు. అఫ్రిదీ (8) స్కోరు బోర్డును పరుగులెత్తించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. అనంతరం అక్మల్ (22), సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ (26) ధాటిగా ఆడారు. ఈ క్రమంలో పాక్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. భారీ షాట్లు ఆడుతూ వీరు అభిమానులను అలరించారు. దీంతో పాక్ వంద పరుగుల మార్కు దాటింది. అనంతరం భారీ స్కోరు చేసేందుకు ప్రయత్నించి వీరిద్దరూ దొరికిపోయారు. అనంతరం హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్లు ఆడడంలో విఫలమయ్యారు. దీంతో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ మినహా నెహ్రా, రైనా, జడేజా, హార్డిక్ పాండ్య, బుమ్రా చెరో వికెట్ తీయడం విశేషం. 119 పరుగుల విజయలక్ష్యంతో భారత జట్టు బ్యాటింగ్ ఆరంభించనుంది. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుండడంతో భారత జట్టు విజయం సాధిస్తుందా? అనే అనుమానం నెలకొంది. న్యూజిలాండ్ పై టీమిండియా స్పిన్ ఆడలేక చతికిలపడిన సంగతి తెలిసిందే.

More Telugu News