: మహిళా ఉద్యోగులకు ఐసీఐసీఐ ‘వుమెన్స్ డే’ బొనాంజా!... ‘వర్క్ ఫ్రం హోం’కు అనుమతి

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దేశీయ ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ తన మహిళా ఉద్యోగులకు బంపర్ బొనాంజాను ప్రకటించింది. ‘వర్క్ ఫ్రం హోం’ పేరిట ఇంటి నుంచే పనిచేసే సరికొత్త పని విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకపై నిర్ణీత సమయాల్లో మహిళలు తమ ఇళ్ల వద్ద నుంచే ల్యాప్ టాప్ ముందేసుకుని కోర్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు బ్యాంకు ఎండీ అండ్ సీఈఓ చందా కొచ్చార్ నేటి ఉదయం ఈ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై మెటర్నిటీ, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాల కారణంగా మహిళలు ఎంతమాత్రం పనికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని కొచ్చార్ ప్రకటించారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా ఈ దిశగా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ... ‘వర్క్ ఫ్రం హోం’ విధానంపై పరిశీలన జరుపుతున్నామని, త్వరలోనే తమ నుంచి ఈ దిశగా కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్లు తెలిపారు.

More Telugu News