: రతన్ టాటా బాటలో ‘రెడ్డీస్’!... ‘స్టార్టప్’కు ఫార్మా దిగ్గజం దన్ను

రతన్ టాటా... చైర్మన్ హోదాలో టాటా సన్స్ గ్రూపును అత్యున్నత శిఖరాలకు చేర్చారు. రిటైర్మెంట్ తీసుకున్న ఆయన మరో విజయవంతమైన పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి గ్రూపు పగ్గాలను అప్పగించేశారు. అయితే పదవీ విరమణ చేసిన రతన్ టాటా విశ్రాంతి తీసుకుంటారని అంతా భావిస్తే.. ఆయన మాత్రం అందుకు భిన్నంగా ‘స్టార్టప్’ తలుపు తడుతున్నారు. కొత్త తరహా వ్యూహాలతో సత్తా చాటుతున్న పలు స్టార్టప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెడుతున్నారు. రెండేళ్లుగా ఇదే బాటలో ఆయన పయనిస్తున్నారు. తెలుగు నేలపై నుంచి ప్రస్థానం ప్రారంభించి ప్రపంచంలోనే ఫార్మా రంగంలో దిగ్గజ కంపెనీగా ఎదిగిన ‘డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్’ కూడా తాజాగా రతన్ టాటా బాటలో పయనించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ ‘మెకిన్సే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రెడ్డీస్ కో-చైర్మన్, సీఈఓ జీవీ ప్రసాద్ ‘స్టార్టప్’ మంత్రాన్ని పఠించారు. పరిశోధనల్లో మరింత మేర దృష్టి సారించాలనుకుంటున్న తాము తమ ఆలోచనల దిశగా సాగే కొత్త సంస్థలకు దన్నుగా నిలబడనున్నామని ఆయన ప్రకటించారు. జాయింట్ వెంచర్లతో పాటు ఆయా స్టార్టప్ లలో కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టి పరిశోధనలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

More Telugu News