: మా అసలు ప్లాన్ ఇదే: రింగింగ్ బెల్స్

ప్రపంచ మొబైల్ రంగాన్నే నివ్వెరపరుస్తూ, కేవలం రూ. 251కి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసి సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా తన మనసులోని మాటను బయటపెట్టారు. తాము ఎటువంటి దురుద్దేశాలతోనూ ఈ పని చేయలేదని, ఇండియాలో ఫీచర్ ఫోన్లు వాడుతున్న 1.4 కోట్ల మందిని స్మార్ట్ ఫోన్లకు దగ్గర చేయాలన్నదే తమ అభిమతమని తెలిపారు. ప్రస్తుతం ఫోన్ లకు ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ కల్పించడమే కీలకమని, దీని ద్వారా ధరను 35 శాతం వరకూ తగ్గించవచ్చని వెల్లడించిన ఆయన, 12 మంది పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నామని, ఏ సమయంలోనైనా రూ. 500 కోట్ల వరకూ సమీకరించి భారీ ఎత్తున మొబైల్స్ తయారీ ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే రెండు నెలల్లో రెండు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు ప్రారంభించి, జూన్ లోగా 25 లక్షల ఫోన్లను డెలివరీ ఇచ్చి చూపాలన్నదే తమ ముందున్న ప్రణాళికని పేర్కొన్నారు. 8 నెలల క్రితం సంస్థను ప్రారంభించినప్పుడు ఈ స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని ఊహించలేదని తెలిపారు. ప్రభుత్వ వర్గాలు తమ ప్రయత్నాలను ఎన్నడూ అడ్డుకోలేదని, వారు అడిగిన సమాచారాన్ని అంతా ఇచ్చామని, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పామని అన్నారు. సంస్థ ఎండీ మోహిత్ గోయల్ తో కలసి వెళ్లి ఇప్పటికే టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో తమ ఆలోచనలను, వ్యాపార విధానాన్ని పంచుకున్నామని, ఆయన కూడా దీనికి సంతోషంగా అంగీకరించారని చద్దా వివరించారు.

More Telugu News