: తీవ్ర ఒడిదుడుకుల మధ్య నామమాత్రపు లాభం!

భారత స్టాక్ మార్కెట్లో వరుస లాభాల పర్వం కొనసాగింది. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 100 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉన్న సెన్సెక్స్ ఆపై తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పటికీ, సెషన్ ముగిసేసరికి నామమాత్రపు లాభాలను నమోదు చేసి సెంటిమెంట్ ను నిలుపుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత ఎఫ్ఐఐలు, దేశవాళీ ఫండ్ సంస్థల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతు మార్కెట్ నష్టాలను నిలువరించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 59.93 పాయింట్లు పెరిగి 0.25 శాతం లాభంతో 23,709.15 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 0.26 శాతం లాభంతో 7,210.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.12 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.16 శాతం లాభపడింది. ఎన్ఎస్ఈ-50లో 26 కంపెనీలు లాభాల్లో నడిచాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, హీరో మోటో కార్ప్, బోష్ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్ తదితర కంపెనీలు లాభపడగా, బీపీసీఎల్, మారుతి సుజుకి, బీహెచ్ఈఎల్, వీఈడీఎల్, కోల్ ఇండియా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,642 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,299 కంపెనీలు లాభాల్లోను, 1,211 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. గురువారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 88,39,016 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ నేడు రూ. 88,54,658 కోట్లకు పెరిగింది.

More Telugu News