: ఏ మాత్రమూ కోలుకోలేని స్థితిలో భారత మార్కెట్!

భారత స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగాయి. ఆరంభంలోనే క్రితం ముగింపుకన్నా 200 పాయింట్ల దిగువకు జారిపోయిన సెన్సెక్స్ మరే దశలోనూ కోలుకోలేదు. ఆపై పలు అంతర్జాతీయాంశాల ప్రభావంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల కొనుగోలుకు ఆసక్తి చూపకపోగా, మరో రూ. 1.20 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. సోమవారం నాటి సెషన్లో రూ. 92,16,341 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 90,95,451 కోట్లకు పడిపోయింది. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 266.45 పాయింట్లు పడిపోయి 1.10 శాతం నష్టంతో 24,020.98 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 89.05 పాయింట్లు పడిపోయి 1.21 శాతం నష్టంతో 7,298.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.91 శాతం, స్మాల్ క్యాప్ 1.34 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 18 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. లుపిన్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టాటా పవర్, బజాజ్ ఆటో తదితర కంపెనీలు లాభపడగా, పీఎన్బీ, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,718 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 822 కంపెనీలు లాభాల్లోను, 1,779 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. ఇప్పటికిప్పుడు భారత మార్కెట్ కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News