: పేరుకు ఘనం... వాస్తవం ఘోరం: నిజాన్ని చెప్పని జీడీపీ గణాంకాలు!

ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 7.3 శాతానికి దగ్గరగా జీడీపీ వృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నప్పటికీ, ఇది కాగితాలపై మాత్రమే గొప్పగా కనిపిస్తోందని, వాస్తవ పరిస్థితులకు నిదర్శనం కాదని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో బలహీనమైన ఎగుమతులు, పెట్టుబడుల రాక మందగించడం, కార్పొరేట్ సంస్థలకు కొత్త ఆర్డర్ల లేమి తదితరాలు భారత వృద్ధికి అడ్డుగా నిలుస్తున్నాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మూడవ త్రైమాసికం గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో రాయ్ టర్స్ ఓ పోల్ నిర్వహించగా, స్థూల జాతీయోత్పత్తి 7.3 శాతం వద్ద ఉండవచ్చని ఎకానమిస్ట్ లు అభిప్రాయపడ్డారు. ఇదే త్రైమాసికంలో చైనా 6.8 శాతానికి పరిమితం కావడం గమనార్హం. "కొత్త జీడీపీ సిరీస్ ను ప్రారంభించడంతోనే మెరుగైన గణాంకాలు నమోదవుతున్నాయి. నిజమైన కార్యకలాపాల సూచికలు పరిగణనలోకి రాకుండానే ఇది తయారైంది" అని ఎల్అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ గ్రూప్ చీఫ్ ఎకానమిస్ట్ రూపా రేగే నెశ్చర్ వ్యాఖ్యానించారు. ఎగుమతులు 13 నెలల కనిష్ఠానికి పతనమయ్యాయని, నిర్మాణ రంగం ఇంకా తేరుకోలేదని, కార్పొరేట్ల ఆదాయం, అమ్మకాల నిష్పత్తిలో పెరుగుదల నమోదు కాలేదని, బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల మొత్తాల్లో మార్పు లేదని ఈ పరిస్థితుల్లో ఇండియా వృద్ధి గణాంకాలు కొంత అనుమానాలు కలిగిస్తున్నాయన్నది అత్యధికుల అభిప్రాయం.

More Telugu News