: జుకెర్ బర్గ్ కు షాకే!... ‘ఫ్రీ బేసిక్స్’కు ట్రాయ్ రెడ్ సిగ్నల్!

ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ ఇటీవల భారత్ లో రెండు, మూడు పర్యాయాలు పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పనిలో పనిగా తన మదిలోని మాటను బయట పెట్టేశారు. ‘ఫ్రీ బేసిక్స్’ పేరిట తనకు మాత్రమే కాసులు కురిపించే సరికొత్త పథకానికి తెర తీశారు. వినూత్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తించారు. మేధావులను సైతం బుట్టలో వేసుకున్న ఆయన ఆ తర్వాత తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్నారు. తదనంతరం ఇక తన పని కాదనుకుని వెనుదిరిగారు. జుకెర్ బర్గ్ ఊహించినట్లుగానే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఆయనకు షాకిచ్చేందుకే సిద్ధమైంది. ఇంటర్నెట్ యూజర్లను తన చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు జుకెర్ బర్గ్ రూపొందించిన ‘ఫ్రీ బేసిక్స్’కు త్వరలోనే రెడ్ సిగ్నల్ వేసేందుకు ట్రాయ్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఫ్రీ బేసిక్స్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ట్రాయ్ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ఫ్రీ బేసిక్స్ తరహాలోనే ‘ఎయిర్ టెల్’ ప్రతిపాదించిన ‘ఎయిర్ టెల్ జీరో’కు తిరస్కారమే ఎదురుకానున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.

More Telugu News