: మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో వర్చువల్ వీడియో కాలింగ్

మొబైల్ ఫోన్లు వచ్చాక ఎవరెక్కడ వున్నా ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం చాలా తేలికైంది. తరువాత వచ్చిన వీడియో కాలింగ్ తో సుదూర ప్రాంతాల వ్యక్తులను చూస్తూ కూడా మాట్లాడుకోవడం వీలైంది. దానికి అప్ డేట్ గా మరింత సాంకేతిక పరిజ్ఞానంతో వర్చువల్ వీడియో కాలింగ్ అందుబాటులోకి రాబోతోంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఈ వర్చువల్ వీడియో కాలింగ్ పరికరాలను రూపొందిస్తోంది. 'రూమ్2రూమ్' పేరుతో కొనసాగుతున్న ఈ పరికరాల ప్రాజెక్టులో 'కైనెక్ట్ కెమెరా టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్నారు. దాంతో ఎదురుగా నిలిచిన వారి దృశ్యాలను 3డీలో చిత్రీకరిస్తూ రియల్ టైంలో అవతలి వ్యక్తికి పంపుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరీక్షల దశలో ఉందని, త్వరలోనే ఈ పరికరాలను మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు మైక్రోసాప్ట్ ప్రతినిధులు వెల్లడించారు. మూడేళ్ల కిందట వచ్చిన 'రోబో' చిత్రంలో ఓ సన్నివేశంలో చిట్టి రోబోతో నటుడు రజనీకాంత్ వర్చువల్ గా మాట్లాడటం మొదటిసారి చూశాం. అంటే ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రదేశాల్లో ఉండగానే అక్కడే ఉండే చిన్న కెమెరాలు ఎదురుగా ఉన్న వారి దృశ్యాలను ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ అవతలి వ్యక్తికి ప్రొజెక్టర్ ద్వారా లైవ్ గా ప్రదర్శిస్తాయి. ఈ నేపథ్యంలోనే వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు.

More Telugu News