: కాగితం పులి కాదని నిరూపించండి... 16,800 మందికి ఆర్బీఐ గవర్నర్ లేఖ
కేంద్ర ప్రభుత్వం చేతుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'ఓ కాగితం పులి' అన్న భావనను పూర్తిగా తొలగించేందుకు ఉద్యోగులంతా కృషి చేయాలని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కోరారు. ఈ మేరకు 16,800 మంది ఆర్బీఐ ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. ఎంతటి సంపన్నులైనా తప్పు చేస్తే శిక్షించాల్సిందేనని ఆయన అన్నారు. ధనవంతులు, శక్తిమంతులపై ఆరోపణలు చేయాలంటే ఎవరూ ఇష్టపడరని, దానివల్ల వారు మరిన్ని తప్పులు చేసేందుకు అవకాశం ఇస్తున్నట్టవుతుందని అభిప్రాయపడ్డ రాజన్, ఇటువంటి పరిస్థితి, మొత్తం ఆర్బీఐపై తప్పుడు అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళుతోందని, ఈ పరిస్థితి మారాలని కోరారు. జరుగుతున్న ఆర్థిక నేరాలను గుర్తించి, కఠినమైన శిక్షలు విధించేలా వ్యవస్థ మరింతగా పటిష్టం కావాలని, ఈ దిశగా నిరంతరం శ్రమించాలని ఉద్యోగులను కోరారు. సమర్ధవంతమైన సిబ్బంది ఉండి కూడా నిబంధనల అమలులో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నామని మండిపడ్డారు. ఉద్యోగులు మీడియాకన్నా ముందుండాలని బాధ్యతలు తెలుసుకొని మలగాలని కోరారు.