: సగానికి తగ్గనున్న సీఎన్జీ ధర!

గ్యాస్ ఆధారిత వాహన వినియోగదారులకు శుభవార్త. సీఎన్జీ గ్యాస్ ధరలు దాదాపు సగానికి తగ్గనున్నాయి. ఇండియాలోకి అత్యధికంగా ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్)ని దిగుమతి చేస్తున్న పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ ను ఎగుమతి చేస్తున్న ఖతార్ ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గతంలో 12 నుంచి 13 డాలర్ల మధ్య ఉన్న ఎంఎంబీటీయూ (మిలియన్ బ్రిటీష్ ధర్మల్ యూనిట్) ధరను 6 నుంచి 7 డాలర్లకు సవరించేందుకు పెట్రోనెట్, ఖతార్ సంస్థ రాస్ గ్యాస్ ల మధ్య డీల్ కుదిరింది. ఈ ఒప్పందంతో ఇండియాకు రూ. 12 వేల కోట్ల రూపాయలు ఆదా కానున్నాయని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. కాగా, రాస్ గ్యాస్ తో పెట్రోనెట్ 25 ఏళ్ల దీర్ఘకాల కాంట్రాక్టును కుదుర్చుకుంది. సాలీనా 7.5 మిలియన్ టన్నుల ద్రవరూప సహజ వాయువును కొనాలన్నది ఒప్పందం. గతంలో ధరలు అధికంగా ఉన్నాయని చెబుతూ, పెట్రోనెట్ సంస్థ సహజవాయువును డెలివరీ తీసుకోవడానికి నిరాకరించగా, ఖతార్ సంస్థ బిలియన్ డాలర్ల జరిమానానూ విధించింది. తాజా చర్చల్లో భాగంగా ఆ జరిమానానూ తొలగిస్తున్నట్టు రాస్ గ్యాస్ పేర్కొనడంతో పెట్రోనెట్ లాభాలు గణనీయంగా పెరుగుతాయని, సీఎన్జీ ధరలు భారీగా తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News