: ట్రయల్స్ లో అదరగొట్టిన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ కన్నా బాగుందన్న క్రెడిట్ సూస్

త్వరలో నాలుగో తరం తరంగాల (4జీ) సేవలను ప్రారంభించనున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సెకనుకు 70 మెగాబైట్ల డౌన్ లోడింగ్ స్పీడును అందించిందట. ప్రముఖ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ క్రెడిట్ సూస్ అనలిస్టులు ఈ విషయాన్ని ప్రకటించారు. "మా ట్రయల్స్ లో గరిష్ఠంగా 70 మెగాబైట్ల స్పీడ్ అందుకున్నాం. అత్యధిక సమయాల్లో 15 నుంచి 30 మెగాబైట్ల స్పీడ్ అందింది" అని విశ్లేషకులు సునీల్ తిరుమలాయ్, చుంకీ షా వెల్లడించారు. అత్యధిక స్పీడుపై ఓ బాలీవుడ్ సినిమాను 30 సెకన్లలో, సాధారణ స్పీడులో మూడు నిమిషాల్లోను డౌన్ లోడ్ చేసినట్టు తెలిపారు. భారతీ ఎయిర్ టెల్ అందిస్తున్న 4జీ సేవలతో పోలిస్తే రిలయన్స్ జియో తరంగాలు వేగంగా ఉన్నాయని వారు తెలిపారు ఎయిర్ టెల్ 4జీ లో 10 నుంచి 20 ఎంబీపీఎస్ వేగం ఉన్నట్టు వివరించారు. కాగా, ప్రస్తుతం పలు ప్రాంతాల్లో తరంగాలను పరీక్షిస్తున్న రిలయన్స్ జియో, మార్చి తరువాత కమర్షియల్ లాంచింగ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే రూ. 95 వేల కోట్లను వెచ్చించిన సంస్థ దేశవ్యాప్తంగా 4జీ సేవలను దగ్గర చేయడంతో పాటు, రూ. 4 వేల ధరలో 4జీకి మద్దతిచ్చే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

More Telugu News