: ఘోరంగా దిగజారిన డాక్టర్ రెడ్డీస్, ఈక్విటీకి 15 శాతం నష్టం

తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ రెడ్డీస్ నిర్వహిస్తున్న ల్యాబొరేటరీస్ లో నాణ్యతలేని ఔషధాలు తయారు చేస్తున్నారని యూఎస్ ఎఫ్డీయే నోటీసులు జారీ చేయడం స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీపై పెను ప్రభావాన్ని చూపింది. శుక్రవారం నాటి సెషన్లో డాక్టర్ రెడ్డీస్ ఈక్విటీ క్రితం ముగింపుతో పోలిస్తే, 14.55 శాతం నష్టపోయింది. ఎలైట్ కంపెనీల్లో అత్యధికంగా నష్టపోయింది ఈ సంస్థే. మొత్తం 40.14 లక్షల ఈక్విటీలు చేతులు మారాయి. మరోవైపు బీహారులో తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్న అంచనాలపై ఏ పార్టీకీ పూర్తి స్పష్టత లేని నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు సైతం అదే దారిలో నడిచారు. అటు కొత్తగా కొనుగోళ్లు, ఇటు అమ్మకాలు లేక సాదాసీదాగా సాగిన సెషన్లో సూచికలు సెషన్ ఆసాంతం క్రితం ముగింపునకు అటూ, ఇటుగా సాగాయి. శుక్రవారం నాటి సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 38.96 పాయింట్లు పడిపోయి 0.15 శాతం నష్టంతో 26,265.24 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 1.15 పాయింట్లు పడిపోయి 0.01 శాతం నష్టంతో 7,954.30 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.41 శాతం, స్మాల్ క్యాప్ 0.60 శాతం పడిపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు లాభపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, పీఎన్బీ, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా తదితర కంపెనీలు లాభపడగా, డాక్టర్ రెడ్డీస్, బోష్, టాటా స్టీల్, టాటా మోటార్స్, వీఈడీఎల్ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,41,973 కోట్లకు పెరిగింది. మొత్తం 2,810 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా,1,034 కంపెనీలు లాభాలను, 1,627 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News