: పండగ వేళ కొనేస్తున్నారు!

ప్రస్తుత పండగ సీజనులో ఆన్ లైన్ షాపింగ్ చేసి వస్తువులను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గత సీజనుతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఇండస్ట్రీ బాడీ అసోచామ్ సర్వే ప్రకారం మెట్రో నగరాల్లో 80 శాతానికి పైగా అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో రెగ్యులర్ ఆన్ లైన్ షాపింగ్ 56 శాతం పెరిగిందని అసోచామ్ వెల్లడించింది. పండగల వేళ ఆన్ లైన్ మాధ్యమంగా కొనుగోళ్లు జరుపుతున్న వారి సంఖ్య ఢిల్లీలో అధికంగా ఉంది. 2014తో పోలిస్తే ఢిల్లీ వాసులు ఈ ఏడు ఇప్పటివరకూ 88.5 శాతం అధిక కొనుగోళ్లు చేశారు. రెండో స్థానంలో నిలిచిన ముంబై నుంచి 80.5 శాతం అధిక కొనుగోళ్లు నమోదు కాగా, ఆ తరువాత అహ్మదాబాద్ (78 శాతం), బెంగళూరు (75 శాతం), హైదరాబాద్ (72.5 శాతం) నిలిచాయి. మాన్యుఫాక్చరింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, హెల్త్ కేర్, రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లోని పలువురు అధికారులు, ఉద్యోగులను సర్వేలో భాగంగా ప్రశ్నించామని అసోచామ్ తెలిపింది. 2009లో సుమారు రూ. 15 వేల కోట్లుగా ఉన్న భారత ఈ-కామర్స్ మార్కెట్, ఈ ఏడు రూ. 50 వేల కోట్లకు పెరిగిందని, 2023 నాటికి ఇది రూ. 3 లక్షల కోట్లకు పైగా చేరుతుందని అంచనా వేసింది. ఇటీవలి కాలంలో గుర్గాం, చండీగఢ్, నాగపూర్, ఇండోర్, కోయంబత్తూర్, జైపూర్, విశాఖపట్నం తదితర చిన్న నగరాల్లో అమ్మకాలు 120 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ సీజనులో మొబైల్ ఫోన్లు అత్యధికంగా అమ్ముడయ్యాయని, మొత్తం అమ్మకాల్లో 65 శాతం మొబైల్ ఫోన్లే ఉన్నాయని తెలిపింది. 18 నుంచి 25 ఏళ్ల యువకుల గ్రూప్ లోని నుంచి 35 శాతం, ఆపై 26 నుంచి 35 ఏళ్ల గ్రూప్ లోని వారి నుంచి 55 శాతం, అంతకుమించిన వారి నుంచి 10 శాతం అమ్మకాలు వచ్చాయని వివరించింది.

More Telugu News