: దాద్రి ఘటన పునరావృతం చేసేందుకు ప్రణాళికలున్నాయి: ఎస్పీ

ఉత్తరప్రదేశ్ లోని దాద్రి గ్రామంలో గోమాంసం తిన్నాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని గ్రామంలోని బీజేపీ నేత కుమారుడు, అతని అనుచరులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలే ఉత్తరప్రదేశ్ లోని మరిన్ని చోట్ల పునరావృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న సమాచారం తమ వద్ద ఉందని సమాజ్ వాదీ పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచామని వారు వెల్లడించారు. ఈ ఘటనను రాజకీయం చేయాలని తాము భావించడం లేదని వారు స్పష్టం చేశారు. దాద్రి ఘటనపై సమాజ్ వాదీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ గ్రామాన్ని సందర్శించే వారిని తాము అడ్డుకోవడం లేదని ఎస్పీ స్పష్టం చేసింది. ఆ గ్రామాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకోవాలనే తాము కోరుతున్నామని వారు తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యులు తమను లక్నోలో కలిశారని, ఆ సందర్భంగా వారికి 45 లక్షల రూపాయల పరిహారంతోపాటు భద్రతతో కూడిన ఇల్లు ఇస్తామని భరోసా ఇచ్చినట్టు సమాజ్ వాదీ పార్టీ నేత చెప్పారు.

More Telugu News