: మరోసారి క్రీజులోకి వస్తున్న మాస్టర్ బ్లాస్టర్...అమెరికాలో ‘జెంటిల్మన్ గేమ్’ ప్రాచుర్యం కోసమేనట!

నిన్నటిదాకా ప్రపంచంలోని చాలా దేశాలకు ‘జెంటిల్మన్ గేమ్’గా ప్రసిద్ధిగాంచిన క్రికెట్ అంటే అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయితే కాలం మారుతోంది. ఇతర దేశాలు కూడా క్రికెట్ పట్ల మక్కువ పెంచుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. త్వరలో ఆ దేశం కూడా క్రికెట్ ఆడే దేశాల చెంత చేరనుంది. ఇందుకోసం ఆ దేశం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అయితే అసలు క్రికెట్ పై ఆ దేశ పౌరులకు ఆసక్తి, అవగాహన ఉంటే కదా. ముందుగా ఆ పనిచేసేందుకు అమెరికా నడుం బిగించింది. దేశంలో క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించేందుకు అమెరికా భారీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో న్యూయార్క్, లాస్ ఏంజెలిస్, హోస్టన్ లలోని బేస్ బాల్ స్టేడియాలు క్రికెట్ మైదానాలుగా మారనున్నాయి. ఇక క్రికెట్ కు ఇప్పటికే వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా ప్రపంచ క్రికెట్ లో దిగ్గజాలుగా ఖ్యాతిగాంచిన 25 మంది ఈ స్టేడియాల్లో క్రికెట్ ఆడనున్నారు. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ మ్యాచ్ ల్లో సచిన్ తో పాటు షేన్ వార్న్, వసీం అక్రం, మైఖేల్ వాన్, మహేల జయవర్ధనే, బ్రియన్ లారా, జాకస్ కలిస్ తదితర 25 మంది దిగ్గజాలు పాల్గొంటారట. వచ్చే నెల 7న న్యూయార్క్ లో, 11న హోస్టన్ లో, 14న లాస్ ఏంజెలిస్ లో మ్యాచ్ లు జరగనున్నాయి.

More Telugu News