: తెలంగాణలో మందుబాబులకు ‘ఎక్స్ ట్రా లార్జ్’?... రాత్రి వేళ మరో గంట పాటు బార్లు బార్లా!

మందుబాబులకు తెలంగాణ సర్కారు నిజంగానే ‘ఎక్స్ ట్రా లార్జ్’ ఇవ్వబోతోంది. రాజధాని హైదరాబాదుతో పాటు జిల్లాల్లోనూ మద్యం విక్రయాల గడువును గంట పాటు పొడిగించడమే కాక బార్లను కూడా మరో గంట పాటు బార్లా తెరిచే ఉంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లోని మద్యం పాలసీలు, ఆయా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు, బార్ల వేళలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించిన మీదట కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో పర్యటించిన ఆబ్కారీ శాఖ అధికారులు ‘గంట పెంపు’పై సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం పేషీలో కేసీఆర్ సంతకం కోసం వేచి చూస్తోందట. కేసీఆర్ సంతకం పడగానే వెనువెంటనే ‘ఎక్స్ ట్రా లార్జ్’ ప్రకటనకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న వైన్ షాపులు రాత్రి 10 గంటల దాకా మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నాయి. ఇక ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు మొదలెడుతున్న బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 11 గంటల దాకా కొనసాగిస్తున్నాయి. తాజాగా ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు సర్కారు అనుమతి లభిస్తే... వైన్ షాపులు రాత్రి 11 గంటల దాకా మద్యాన్ని విక్రయిస్తాయి. అదే విధంగా బార్లు అర్ధరాత్రి 12 గంటల దాకా తెరిచే ఉంటాయి.

More Telugu News