: ఆర్బీఐ అండతో మార్కెట్లకు కళ... నేటి సెషన్లో రూ. 11 వేల కోట్ల లాభం!

రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయం మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచగా, నష్టాల్లో ఉన్న సూచికలు లాభాల బాటలో నడిచాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి రూ. 94,76,024 కోట్ల వద్ద ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 94,87,425 కోట్లకు చేరడంతో, ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 11 వేల కోట్లకు పైగా పెరిగినట్లయింది. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 161.82 పాయింట్లు పెరిగి 0.63 శాతం లాభంతో 25,778.66 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 47.60 పాయింట్లు పెరిగి 0.61 శాతం లాభంతో 7,843.30 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.42 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.11 శాతం నష్టపోయింది. మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, బోష్ లిమిటెడ్, బీపీసీఎల్, హిందాల్కో, టాటా స్టీల్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

More Telugu News