: వడ్డీ రేట్లు తగ్గే సమయం!

రేపు జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్షలో రెపో రేటు (బ్యాంకుల వద్ద ఉండే ఆర్బీఐ నిధులపై ఇవ్వాల్సిన వడ్డీ రేటు)ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవచ్చని రాయిటర్స్ నిర్వహించిన పోల్ లో పాల్గొన్న 51 మంది ఆర్థికవేత్తల్లో 45 మంది అభిప్రాయపడ్డారు. పరపతి సమీక్ష తరువాత ప్రస్తుతం 7.25 శాతంగా ఉన్న రెపో రేటు పావు శాతం తగ్గి 7 శాతంగా మారుతుందని వారు వివరించారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, వడ్డీ రేట్లను తగ్గించేందుకు సహకరిస్తుందని, ఇదే సమయంలో పలు నిత్యావసర వస్తు ఉత్పత్తుల ధరలు అధికంగా ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ ముప్పావు శాతం మేరకు రెపో రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ దఫా వడ్డీ రేట్లు తగ్గితే, గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలను బ్యాంకుల నుంచి పొంది నెలవారీ కిస్తీలు చెల్లిస్తున్న వారికి కొంత ఉపశమనం వెంటనే లభించే అవకాశాలున్నాయి. ఇదిలావుండగా, తనపై ఒత్తిడి తీసుకువచ్చినంత మాత్రాన రేట్లు తగ్గిస్తూ, నిర్ణయం తీసుకోలేమని, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతే తుది నిర్ణయానికి వస్తామని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఇప్పటికే స్పష్టం చేశారు.

More Telugu News