: దూసుకెళ్తున్న బంగారం... రూ. 27 వేలు దాటిన ధర

శుభకార్యాలు, పండగ సీజన్ కొనసాగుతున్న వేళ ఆభరణాల తయారీదారులు, స్టాకిస్టులతో పాటు ట్రేడర్లు సైతం బంగారం కొనుగోళ్ల దిశగా మొగ్గు చూపుతూ ఉండటంతో ధర మరోసారి రూ. 27 వేల ఎగువకు చేరింది. శుక్రవారం నాటి బులియన్ సెషన్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 400 పెరిగి రూ. 27,250కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1,100 పెరిగి 36,500కు చేరింది. నాణాల తయారీదారుల నుంచి వెండి కొనుగోళ్లు అధికంగా జరిగినట్టు బులియన్ వర్గాలు వెల్లడించాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, ఔన్సు బంగారం ధర 2.11 శాతం పెరిగి 1,154.10 డాలర్లకు చేరింది. ఆగస్టు 24 తరువాత బంగారం ధర ఇంత అధిక స్థాయికి చేరడం ఇదే మొదటి సారి. వెండి ధర ఔన్సుకు 2.43 శాతం పెరిగి 15.15 డాలర్లకు చేరింది. రూపాయి బలహీన పడటం కూడా దేశంలో బంగారం ధరలు పెరిగేందుకు కారణమైందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

More Telugu News