: హద్దుమీరిన ఫేస్ బుక్ ఉద్యమం 'క్యాచ్ యువర్ థీఫ్'

సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ వేదికగా ప్రారంభమైన 'క్యాచ్ యువర్ థీఫ్' ప్రచారం దారుణమైన హింసకు వేదికగా మారింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ స్థానికులు పలువురికి దేహశుద్ధి చేస్తున్నారు. హుహాంకయోలో సిసిలియా రోడ్రిగ్స్ అనే మహిళ తన ఇంట్లోకి చొరబడ్డ దొంగను చుట్టుపక్కల వారి సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించింది. అతనిని తీసుకెళ్లిన పోలీసులు కాసేపు విచారించి వదిలేశారు. దీనిపై ఆగ్రహించిన సిసీలియా రోడ్రిగ్స్ ఫేస్ బుక్ వేదికగా 'క్యాచ్ యువర్ థీఫ్' ప్రచారం ప్రారంభించింది. దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే ఫలితం ఉండదని, అలాంటి వారికి దేహశుద్ధే సరైన శిక్ష అని పేర్కొంటూ తన అభిప్రాయాలు వెల్లడించింది. ఈ ప్రచారం త్వరగానే ఉద్యమరూపం దాల్చింది. దొంగను పట్టుకుంటే దారుణంగా చితక్కొడుతున్నారు. వేశ్యాగృహాలపై కూడా దాడులు పెరిగిపోయాయి. సందట్లో సడేమియాగా ఈ ప్రచారంలో పాలుపంచుకుంటున్న సంఘవ్యతిరేక శక్తులు తమ వ్యతిరేకులపై దొంగలనే ముద్ర వేసి బహిరంగ ప్రదేశాల్లో కట్టేసి చితక్కొడుతున్నారు. చేతికి ఏది అందితే దానితో కొడుతున్నారు. వీరిని ఆపేందుకు పోలీసులు నానాతంటాలు పడుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఒకసారి హెచ్చరించి వదిలి పెడుతున్నామని, రెండోసారి ఇలాంటి తప్పుకు పాల్పడితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News